Tuesday 7 September 2010

హస్తం గుర్తు లేని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన జగన్!


ప్రకాశం జిల్లాలో కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్న ఓదార్పు యాత్రలో పలు సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు పూర్తి చేసిన రెండు దఫాల ఓదార్పు యాత్రలో కాంగ్రెస్ కండువాను భుజంపై వేసుకోని జగన్.. తాజాగా హస్తం గుర్తులేని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.


జిల్లాలో సాగుతున్న ఓదార్పు యాత్రలో భాగంగా నాలుగో రోజైన సోమవారం పామూరు, పిసిపల్లి మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పిసిపల్లి మండలం గుంటుపల్లి గ్రామంలో స్థానికులు హస్తం గుర్తు లేని మూడు రంగుల జెండాను తయారు చేసి, ఆవిష్కరించాల్సిందిగా పట్టుబట్టారు.


దీంతో దిగివచ్చిన జగన్.. జెండాను ఆవిష్కరించారు. ఈ జెండాలో హస్తం గుర్తు లేదా ఇందిరా, సోనియా గాంధీల బొమ్ములు లేదా వైఎస్ బొమ్మ కూడా లేకపోవడం గమనార్హం. కాగా, త్రివర్ణ పతాకంలో హస్తం గుర్తుతో పాటు... ఎలాంటి గుర్తు లేక పోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమంలో జగన్ వెంట రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి కూడా ఉన్నారు.

No comments:

Post a Comment