Friday 1 October 2010

అయోధ్య తీర్పు ప్రధానాంశాలు

కట్టుదిట్టమైన భద్రత, తీవ్ర ఉత్కంఠ మధ్య రామజన్మభూమి - బాబ్రీ మసీదు కేసుపై తీర్పు వెలువడింది. 60 ఏళ్లుగా నలుగుతున్న వివాదంపై ఒక్కో అంశాన్ని తీసుకుని న్యాయమూర్తులు తీర్పు వెలువరించారు. 2-1 మెజార్టీతో వచ్చిన జడ్జీమెంట్‌లోని ప్రధాన అంశాలివి...
వివాదాస్పద స్థలం రామజన్మభూమేనా?
వివాదాస్పద స్థలం రాముని జన్మస్థలమే. బాల రాముడు అక్కడ పూజలందుకుంటున్నాడు. వివాదాస్పద కట్టడం మసీదేనా?
వివాదాస్పద కట్టడాన్ని బాబర్ నిర్మించాడు. అది ఎప్పుడనేది కచ్చితంగా నిర్ధారణ కాలేదు. అయితే కట్టడాన్ని ఇస్లాం ప్రాథమిక సూత్రాలకు వ్యతిరేకంగా నిర్మించినందునమసీదుగా పరిగణించలేం.
హిందూ ఆలయాన్ని కూల్చివేసిన తర్వాత మసీదు నిర్మాణం జరిగిందా?
అప్పటికే ఉన్న నిర్మాణాన్ని కూల్చివేసి వివాదాస్పద కట్టడాన్ని నిర్మించారు. అప్పటికే ఉన్నది భారీ హిందూ మత కట్టడమని భారత పురావస్తు శాఖ నిర్ధారించింది.
వివాదాస్పద కట్టడంలో 1949లో విగ్రహాలను ఉంచారా?
వివాదాస్పద కట్టడంలోని మధ్య గుమ్మటం వద్ద 1949 డిసెంబరు 22-23నాటి రాత్రి విగ్రహాలను ఉంచారు. వివాదాస్పద స్థలాన్ని ఇప్పుడేం చేయాలి?
వివాదాస్పద స్థలం రామచంద్రుడి జన్మభూమి. అక్కడున్న రాముడు, సీత, ఇతర విగ్రహాలను పూజించే హక్కు హిందువులకు ఉంది. ఆ ప్రాంతాన్ని రామజన్మభూమిగా, పవిత్రయాత్రాస్థలంగా భావిస్తూ హిందువులు పూజలు చేస్తున్నారు. వివాదాస్పద కట్టడం నిర్మించిన తర్వాత 1949 డిసెంబరు 22-23 నాటిరాత్రి అందులో దేవతా విగ్రహాలను ఉంచారు. అయితే బయటిప్రదేశం ఎప్పుడూ హిందువుల స్వాధీనంలోనే ఉండగా, లోపలి భాగంలో కూడా పూజలు జరుగుతున్నాయి.
కేసుపై ఈ విషయాలను క్లారిఫై చేసిన కోర్టు, వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలుగా విభజించాలని తీర్పునిచ్చింది. ఇందులోని భాగాలను హిందువులకు, ముస్లింలకు, నిర్మోహీ అఖాడాలకు సమానంగా పంచాలని తెలిపింది. సెంట్రల్ డోమ్‌ వద్ద ఉన్న విగ్రహాలను అలాగే ఉంచి హిందువులకు కేటాయించాలంది. రామ్‌ చబుత్రా, సీతా రసోయి ప్రాంతాన్ని అఖాడాకు ఇవ్వాలనీ, వెలుపలి ప్రాంతాన్ని ముస్లింలకు ఇవ్వాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై అప్పీలు చేసేందుకు మూడు నెలల గడువిచ్చిన హైకోర్టు, అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగించాలని సూచించింది.

No comments:

Post a Comment